Monday, May 4, 2009

ఖండిత

వి. ప్రతిమ రాసిన ఖండిత చదివానీవారం.
15 కథలున్న పుస్తకం. మొదటి రెండు కథలు (నాగలోకం, దృశ్యాదృశ్యం) కాస్త పరవాలేదు.
మిగతా కథలు అసలు బాగాలేవు.
ఎన్నో విషయాలు ఒకే కథలో ఇమిడ్చే ప్రయత్నం, అసలేం చెప్పదల్చుకున్నారో అర్ధం కాకుండా పోవడం.. చాలా కథల్లో ఇదే ధోరణి.
టైటిల్ స్టోరీ ఖండిత తీసుకుంటే.. ఒక నడివయసు స్త్రీ వంటరి తనం, అర్ధం చేసునే భర్త లేకపోవడం, మనసుకు దగ్గరగా ఓ స్నేహితుడో స్నేహితురాలో (సరైన వాళ్ళు) దొరకకపోవడం, తనకు నచ్చినట్లుగా తనని వుండనీయక లోకం ఆంక్షలు పెట్టడం.. ఇన్ని విషయాలు ఒకేకథలో చొప్పించే ప్రయత్నం.
పై లిస్టులో ఆఖరి విషయం - సంస్కారవంతులు, "అసామాన్యులు" అనుకున్నవాళ్ళు కూడా స్త్రీ విషయానికి వచ్చేసరికి సామాన్యులకన్నా సంస్కారహీనంగా ప్రవర్తించడం, ఆంక్షలు పెట్టడం అన్న విషయం ఒకటే ఈ కథలో కొత్త విషయం. మిగతాదంతా పాత విషయమే. ఇదే సంపుటిలో మిగతా కథల్లో రిపీటైన విషయమే. ఆ ఒక్క విషయాన్నే పట్టుగా రాస్తే బాగుండేది. అది వదిలేసి భర్తని అనవసరంగా, అవకాశం దొరికినపుడల్లా ఆడిపోసుకోవడం అసంబద్ధంగా వుంది.

కథానాయిక భావాలని భర్త అర్ధం చేసుకోడు. మరో సాహితీ మిత్రుడితో కలిసి ఆమె ఎంతో ఆశతో ఏదో సాహితీ సమావేశానికి వెళ్తుంది. అక్కడ సాహితీ మిత్రులందరూ (ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా) తనపై పెట్టే ఆంక్షలు ఆమెని ఆశ్చర్య పరుస్తాయి.

సరే అక్కడివరకూ బానే వుంది. ఆతర్వాత ఇంటికి తిరిగివస్తుంది. అక్కడ ఈ క్రింది వాక్యాలు…
“అదే కాంపౌండు.. అవే గులాబీలు.. అదే యిల్లు..
ఎక్కడో ఏదో మార్పు. నీకాళ్ళు వణుకుతున్నాయి.”

ఇంట్లో ఏ మార్పూ లేదు కదా! భర్త అలాగే వున్నాడు. మరి ఈ వాక్యాలకర్ధం ఏమిటి?
బయటి పరిస్థితి ఇంటికన్నా ఘోరం అని తెలిసినపుడు.. ఒకవేళ అనిపిస్తే ఇల్లు ఇదివరకటి కంటే బాగా అనిపించాలి. లేదా ఇదివరకటిలాగానే అనిపించాలి. అంతేకానీ కొత్తగా కాళ్ళు వణకడమెందుకు?
పైగా ఆ తర్వాత పేరాలో..
"రెండు రోజులేనని చెప్పి నాలుగు రోజులకొచ్చినందుకు ఏదో జరిగిపోయినట్లు దెప్పిపొడూస్తున్నాడు నీ భర్త. ఒక్కసారి.. ఒకరోజు రాత్రి అతడితో కాకుండా .. మరెక్కడయినా వుండిపోవాల్సి వస్తే .. మరెక్కడయినా పడుకున్నట్లయితే యిక శీలం పోయినట్లేనా!? ..." అన్న వాక్యాలు….
ఎంత అఘాయిత్యంగా వుంది యిది!
రెండు రోజులకి బదులు నాలుగు రోజులకి వస్తే భర్తలు (చాలాసార్లు భార్యలు కూడా) దెప్పిపొడవడం వేరు. శీలం పోయిందన్న అనుమానంతో సాధించడం వేరు.
రెండురోజులని చెప్పి నాలుగురోజులకొస్తావా అని భర్త ఆడిగితే .. "నేనొక్క రోజు బయట పడుకుంటే శీలం పోయినట్లేనా!" అని బాధపడడం ఆ భర్తకి లేనిపోని అనుమానాలు కల్పించడం కాదూ! ఎంత తెలివితక్కువ భార్య అయినా ఇలా బోడిగుండుకీ మోకాలికీ లంకె వేసి బాధపడుతుదా!

మరో కథ ప్రాణశంఖం లోనూ ఇదే ధోరణి. భావుకురాలయిన భార్యకి ప్రాక్టికల్ భర్త వల్ల కలిగే ఆశాభంగం.. బాధా.. ఇదీ కథ ఇతివృత్తం.
దానిలో స్త్రీవాదాన్ని చొప్పించే ప్రయత్నం చేయకుండా ఆ ఇతివృత్తాన్ని అందంగా రాసివుండచ్చు.
ఎందుకంటే అది చాలా సున్నితమయిన విషయం. కథానాయిక భావుకత అరుదయిన విషయం. అది ఆమె అన్నకు అర్ధంవుతుంది. భర్తకి అర్ధం కాదు. స్త్రీ అయినా వదినకి అర్ధం కాదు. అలాంటి జీవితమే గడిపిన ఆమె తల్లికి అది ఒక సమస్యే కాదు.
అంటే ఇక్కడ సమస్య స్త్రీయా పురుషుడా అన్నదికాదు.. మరి అలాంటపుడు..
"తండ్రి లేడుగానీ ..వుండి వుంటే.. ఏంటమ్మా!.. అతడితో సహకరింఛాల్సింది పోయి లా పాయింట్లు తీస్తే ఎట్లమ్మా.. అని సలహాలిచ్చివుండేవాడే. ఎందుకంటే అతనూ మగవాడే" అని హీరోయిన్ అనుకోవడం చిరాకు తెప్పిస్తుంది.
ఇక మార్తా లాంటి కథ ఇంత సీనియర్ రచయిత్రి రాసిందంటే నమ్మేట్లు లేదు. అంటరానిపిల్లని కోడలు ఇంట్లో తెచ్చి పెట్టుకుందని సాధిస్తున్న అత్తగారు కథ చివర్లో టక్కున మారిపోతుంది. ఎందుకో!
పాత్రలకు సరిపడని భాషలూ, భావాలూ ఈ సంపుటిలో చాలా చోట్ల కనిపిస్తాయి.
చదువుకున్న వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు పనిచేసి వచ్చిన పనిపిల్ల చంద్రిక ఆలోచనలు ఇలా వుంటాయి.
"..తరతరాలుగా వస్తోన్న పద్ధతులని మార్చుకోవడానికి అమ్మా, నాయినా యిష్టపడరు. తను చెప్పినా వినరు. ఇక్కడ వీళ్ళంతా కేవల శరీరాల కోసం, శరీరాలతో బ్రతుకుతున్నారు. వీళ్ళందరి నుండీ వేరుగా తనకొక ఆలోచన వుంది. ఎలా జీవించాలో తెలుస్తోంది. అదొక్కటే వీళ్ళకీ తనకీ తేడా.."
ఎంత గంభీరమయిన ఆలోచనలు!

మరో కథలో బస్ కోసం వెయిట్ చేస్తూన్న హీరోయిన్ గురించి చెప్తూ "ఎన్నో కాంతిసంవత్సరాలు గడిచిపోయాక మరో బస్ వచ్చింది" అన్న వాక్యం.
బస్ కోసం వెయిట్ చేసే "టైం" కాంతి సంవత్సరాలట!!

ఇంకా కథల్లో పాత్రలు మాట్లాడుతూన్నపుడు…. ఒక పాత్ర మాట్లాడే మాటల్లోనుంచి మనకి ఒక విషయం అర్ధం అవుతుంటే కథలోని మరో పాత్రకి మాత్రం ఇంకేమిటో అర్ధం అవుతూ వుంటుంది.
ఉదాహరణకి ‘విధ్వంసానికి ఆవలివైపు’ కథలో జయరాముడు అనే పాలేరు తన తండ్రితో "..నిజం చెప్పు.. అమ్మ చచ్చిపోయింది ఆ కిస్టారెడ్డి వల్ల గాదా! దాన్ని నేను మర్చిపోగల్తానా!" అంటాడు.
అది చదివితే మనకి కిస్టారెడ్డి అనే వాడు జయరాముడి తల్లి మీద అత్యాచారమో, అత్యాచార ప్రయత్నమో చేశాడని అర్ధమవుతుంది. కానీ ఆ మాటలు వింటున్న మరో పాత్రకి మాత్రం జయరాముడు కూడా కిస్టా రెడ్డి కొడుకే అన్న విషయం అర్ధమయి, అది జ్వాలయి మెదడుని మండిస్తుంది!!
ఇవీ ఈ పుస్తకం లోని కథల పట్ల నాకు కలిగిన అభిప్రాయాలు.

1 comment:

  1. "కాంతి సంవత్సరాలు" హ హ హ.
    పోన్లెండి, అదింకా శాస్త్ర సంబంధమైన పారిభాషిక పదం. మన కవులూ కథకులూ మామూలు భాషలో వాడుకల్నే అర్ధం తెలీక గజిబిజిగా వాడేస్తుంటారు.
    ప్రతిమ గారివి ఏవో పత్రికల్లో, సంకలనాల్లో కొన్ని కథలు చదివాను. పర్లేదు, బాగా రాస్తారనే ఒక అభిప్రాయం ఉండేది, కానీ స్పష్టంగా ఏమీ గుర్తు లేదు.
    మీ సమీక్ష, మంచి చెడ్డలు రెంటినీ స్పృశిస్తూ బాగుంది.

    ReplyDelete